Find Articles

న్యూజిలాండ్‌ గడ్డపై మెగా సిరీస్.. 12 మ్యాచ్‌లలో తలపడనున్న కివీస్, టీమిండియా

న్యూజిలాండ్‌ గడ్డపై మెగా సిరీస్.. 12 మ్యాచ్‌లలో తలపడనున్న కివీస్, టీమిండియా

భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది చివర్లో న్యూజిలాండ్‌లో సుదీర్ఘ పర్యటనకు సిద్ధమైంది. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య క్రీడా సంబంధాలు ప్రారంభమై వందేళ్లు పూర్తయ్యాయి. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని మెగా సిరీస్ నిర్వహించున్నాయి.

అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు 40 రోజుల పాటు సాగే మెగా పర్యటనలో ఇరు జట్లు మొత్తం 12 మ్యాచ్‌లలో తలపడనున్నాయి. ఇందులో 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు ఉన్నాయి. అయితే న్యూజిలాండ్ గడ్డపై ఇప్పటివరకు ఏ దేశంతోనూ ఇంత పెద్ద ద్వైపాక్షిక సిరీస్ జరగలేదు. అక్టోబర్ 22న క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌తో ప్రారంభంకానుండగా.. మొత్తం ఐదు టీ20ల సిరీస్ నవంబర్ 1న ముగుస్తుంది. ఆ తర్వాత నవంబర్ 4న ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో తొలి వన్డేతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మొదలవుతుంది. ఈ సిరీస్‌లోని చివరి రెండు వన్డేలకు మౌంట్ మాంగనూయ్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే అందరి దృష్టి మాత్రం టెస్టు సిరీస్‌పైనే ఉంది. రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు నవంబర్ 19 నుంచి 23 వరకు వెల్లింగ్‌టన్‌లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో జరగనుంది. రెండోది, పర్యటనలో చివరిది అయిన టెస్టు మ్యాచ్ నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు క్రైస్ట్‌చర్చ్‌లోని హ్యాగ్లీ ఓవల్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా 40 రోజుల సుదీర్ఘ పర్యటన ముగుస్తుంది.

2019-20 తర్వాత టీమిండియా న్యూజిలాండ్‌లో టెస్టు సిరీస్ ఆడటం ఇదే తొలిసారి. అయితే, ఈ మధ్య కాలంలో కివీస్ టీమ్ రెండుసార్లు భారత్‌లో పర్యటించింది. ముఖ్యంగా 2024-25 పర్యటనలో భారత్‌ను సొంత గడ్డపైనే 3-0 తేడాతో ఓడించి టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజా సిరీస్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇరు దేశాల మధ్య వందేళ్ల క్రీడా బంధానికి గుర్తుగా న్యూజిలాండ్ ప్రభుత్వం ఈ పర్యటనకు ప్రత్యేక మద్దతు ఇస్తోంది.

ManaTV Team