
ఆఫ్ఘనిస్థాన్తో జరగబోయే వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హ్యోమ్ స్ట్రింగ్ గాయం కారణంగా సిరీస్ కు దూరం కానున్నారని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
ఈ నెల 13 నుంచి 20 వరకు భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో కోహ్లీకి ఈ గాయమైనట్లు సమాచారం. ఆ మ్యాచ్లోనే గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించిన ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకుంది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్లో కోహ్లీ 42 బంతుల్లో 75 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. మ్యాచ్ ముగిసే సమయంలో కోహ్లీ పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతూ కనిపించారు. కానీ మ్యాచ్ను అద్భుతంగా ముగించి, టీమ్ విజయ తీరాలకు చేర్చారు.
ఐపీఎల్ 2026 సీజన్లో కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబరిచారు. 16 మ్యాచ్ల్లో 675 పరుగులు సాధించాడు. ఈ ఫామ్ను ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లోనూ కొనసాగించి.. 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో తన అవకాశాలను మరింత బలపర్చుకోవాలని కోహ్లీ భావించారు. కానీ గాయం ఆయన ప్లాన్స్ కు అడ్డంకిగా మారింది. ఇప్పుడు అతని స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ జూన్ 6న న్యూ చండీగఢ్లో జరిగే టెస్టుతో ప్రారంభమవుతుంది. అనంతరం జూన్ 13న ధర్మశాలలో తొలి వన్డే, జూన్ 17న లక్నోలో రెండో వన్డే, జూన్ 20న చెన్నైలో మూడో వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. అయితే విరాట్ కోహ్లీ సిరీస్ కు అందుబాటులో ఉంటారా? లేదా? అనే దానిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

