
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధిలో ఆకలితో వచ్చే ప్రతి భక్తుడికి తృప్తికరమైన భోజనం అందించాలనే సంకల్పంతో టీటీడీ నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమం నేడు మహాయజ్ఞంలా కొనసాగుతోంది. దేశ విదేశాల నుంచి తిరుమలకు చేరుకునే లక్షలాది మంది భక్తులకు ప్రతిరోజూ ఉచితంగా, నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ “అన్నదానం మహాదానం” అనే భారతీయ సనాతన సంప్రదాయాన్ని సజీవంగా నిలబెడుతోంది. రోజుకు లక్షలాది మందికి అన్నప్రసాదం అందిస్తున్న ఈ మహోన్నత సేవ వెనుక ఉన్న విశేషాలపై ప్రత్యేక కథనం.
1985 ఏప్రిల్ 6న ప్రారంభమైన టీటీడీ నిత్యాన్నదాన పథకం… నేడు శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యంత విస్తృత స్థాయిలో కొనసాగుతోంది. తిరుమలకు విచ్చేసే ప్రతి భక్తుడు ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో టీటీడీ నిరంతరం సేవలను విస్తరిస్తోంది.
సాధారణ రోజుల్లో లక్షా 80 వేల నుంచి లక్షా 90 వేల మంది వరకు భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుండగా… వారాంతాలు, పర్వదినాలు, సెలవు దినాల్లో ఈ సంఖ్య మూడు లక్షలకు పైగా చేరుతోంది. గత మూడు నెలల సగటు గణాంకాల ప్రకారం రోజుకు సుమారు 70 వేల మందికి పాలు, టీ, కాఫీ వంటి పానీయాలు… 60 వేల మందికి పైగా అల్పాహారం… దాదాపు లక్ష మందికి మధ్యాహ్న భోజనం… 56 వేల మందికి పైగా రాత్రి భోజనం అందిస్తున్నారు. మొత్తంగా ప్రతిరోజూ సుమారు మూడు లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందజేస్తున్నారు.
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలోనే రోజుకు 82 వేల మందికి పైగా భోజనాలు అందిస్తున్నారు. అక్షయ కిచెన్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, పీఏసీ కేంద్రాలు, క్యూ లైన్ల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల ద్వారా లక్షలాది మంది భక్తులకు ఆహారం, పానీయాలు అందిస్తున్నారు.
భక్తులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రతిరోజూ దాదాపు 15.8 టన్నుల బియ్యం వినియోగిస్తున్నారు. వేల కిలోల పప్పుదినుసులు, రవ్వ, నూనె, బెల్లం తదితర ముడి పదార్థాలతో రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని సిద్ధం చేస్తున్నారు.
ప్రతినెలా లక్షలాది మంది భక్తులు
2026 జనవరి నుంచి మే నెలాఖరు వరకు తిరుమలలోని వివిధ అన్నప్రసాద కేంద్రాల ద్వారా మొత్తం 4 కోట్ల 40 లక్షలకు పైగా భక్తులకు అందించినట్లు టీటీడీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి నెలా లక్షలాది మంది స్వీకరిస్తున్నారు.
అన్నప్రసాద సేవలను మరింత విస్తరించేందుకు టీటీడీ ఆధునిక సాంకేతికతను కూడా వినియోగిస్తోంది. వకుళమాత సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా అదనపు ప్రాంతాలకు అన్నప్రసాద పంపిణీని విస్తరించగా… ఇటీవల ప్రారంభించిన పీఏసీ–5 వెంకటాద్రి నిలయంలో ఒకేసారి 1,500 మంది భోజనం చేసే సామర్థ్యంతో డైనింగ్ హాల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే రోజుకు రెండు లక్షల మందికి ఆహారం తయారు చేయగల శాటిలైట్ ఆటోమేటెడ్ కిచెన్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
నిధులకు కొరత లేదు
భక్తుల విరాళాలతో నిర్వహించబడుతున్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ వద్ద ప్రస్తుతం రూ.2,500 కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఆ నిధుల ద్వారా వచ్చే ఆదాయంతో లక్షలాది మంది భక్తులకు ప్రతిరోజూ ఉచితంగా నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. ఆకలితో వచ్చే ప్రతి భక్తుడిని తృప్తిపరుస్తూ… “అన్నదానం మహాదానం” అనే భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటుతూ… టీటీడీ అన్నప్రసాద సేవలు నేటికీ భక్తుల పాలిట నిజమైన అక్షయపాత్రగా నిలుస్తున్నాయి.

