
బంగ్లాదేశ్తో జరగనున్న టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా టీమ్ లో కీలక మార్పు చోటుచేసుకుంది. వ్యక్తిగత కారణాలతో సిరీస్కు దూరమైన స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ స్థానంలో భారత సంతతి ఆల్ రౌండర్ నిఖిల్ చౌదరి ఎంపిక అయ్యారు.
ఢిల్లీలో జన్మించిన నిఖిల్, ఫైనల్ టీమ్ లో చోటు దక్కించుకుంటే… 1964 తర్వాత భారత్ లో జన్మించి, ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన తొలి భారత సంతతి క్రికెటర్గా చరిత్ర సృష్టించనున్నారు. బంగ్లాదేశ్లోని పిచ్లు స్పిన్కు అనుకూలించే అవకాశం ఉన్న నేపథ్యంలో నిఖిల్కు తుది జట్టులో అవకాశం దక్కవచ్చని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మిచెల్ మార్ష్ సారథ్యంలోని ఈ టీమ్ లో ఆడమ్ జంపా, మాథ్యూ కునెమన్లతో కలిసి నిఖిల్ స్పిన్ విభాగంలో కీలక పాత్ర పోషించనున్నారు.
బిగ్ బాష్ లీగ్లో హోబర్ట్ హరికేన్స్ తరఫున, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నిఖిల్ తన ప్రదర్శన కనబరిచారు. లెగ్ స్పిన్తో పాటు మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల నిఖిల్ చౌదరి.. దేశవాళీ, ఫ్రాంచైజీ క్రికెట్లో నిలకడగా రాణించి, జాతీయ జట్టు నుంచి తొలిసారి పిలుపు అందుకున్నారు. కాగా జూన్ 17 నుంచి చట్టోగ్రామ్ వేదికగా ఈ టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

