
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, నాగ్ అశ్విన్ నిర్మించిన చిత్రం ‘సింగ్ గీతం’. ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్టులో చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపిన చిరు, సింగీతంని తెలుగు పరిశ్రమ ‘భీష్మాచార్యుడు’గా అభివర్ణించారు.
“శ్రీ సింగీతం శ్రీనివాసరావు తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన ఒక భీష్మాచార్యుడు. ఆయన ఒక అమూల్యమైన ఆస్తి, ఒక నిధి. దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, ఎంతోమంది కళాకారులకు అవకాశాలు కల్పించారు. వారి జీవితాలకు మార్గదర్శకుడయ్యారు. అలాంటి మహోన్నత వ్యక్తి దర్శకత్వంలో ఈ నెల 12వ తేదీన ‘సింగ్ గీతం’ సినిమా విడుదలై, భారతీయ సినీ చరిత్రలో మరొక మైలురాయిగా నిలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.
అదేవిధంగా ఇలాంటి పెద్దలను గౌరవిస్తూ, వారి అనుభవాన్ని కొత్త తరానికి అందించే ఆలోచనతో ఈ సినిమాను నిర్మించిన నాగ్ అశ్విన్ ను కూడా చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. ఓవైపు ఆ నాటి తరానికి ప్రతినిధిగా నిలిచిన సింగీతం శ్రీనివాసరావు, మరోవైపు ఈ తరం ఆలోచనలను ప్రతిబింబించే నాగ్ అశ్విన్.. వీరి కలయిక ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే ఈ చిత్రంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు” అని చిరంజీవి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

