
వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ తాము రియల్ హీరోలమని టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిరూపించారు. ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ నూతన దంపతులు, నాటి తమ హామీని నెరవేరుస్తూ ఆదివారం నాడు నాగర్కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలోని తుమ్మన్పేట గ్రామానికి విచ్చేశారు.
ఫౌండేషన్ ద్వారా విద్యా భరోసా:
‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని 45 ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో 9, 10వ తరగతుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన మొత్తం 180 మంది మెరిట్ విద్యార్థుల జాబితాను ఫౌండేషన్ అధికారికంగా విడుదల చేసింది. ఈ స్కాలర్షిప్ కార్యక్రమం కింద ఎంపికైన విద్యార్థుల చదువుకు అయ్యే పూర్తి ఖర్చును తామే భరిస్తామని విజయ్-రష్మిక దంపతులు భరోసా ఇచ్చారు.
తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడమే నా కల – విజయ్ దేవరకొండ:
ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “ఈ చిన్న స్కాలర్షిప్ గిఫ్ట్ ఇవ్వడం చాలా చిన్న విషయం కావచ్చు, కానీ మాకు ఇది ఎంతో ముఖ్యం. మీ జీవితాల్లో నేను ఒక భాగం కావాలనుకుంటున్నాను. మెల్లగా నా సొంత గ్రామం తర్వాత, ఈ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రతిభ గల పేద విద్యార్థులకు అండగా నిలిచేలా విస్తరించాలనేదే నా కల. విద్యార్థుల్లోని క్రమశిక్షణ, ఫోకస్ను గౌరవించడానికే ఈ ప్రయత్నం” అని పేర్కొన్నారు.

