అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో బాల్టిమోర్లో అత్యంత వేడుకగా జరగనున్న 19వ ఆటా మహాసభలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ, మహాసభల సంబరాలకు తెలుగు ప్రజలందరినీ సాదరంగా ఆహ్వానించారు. మహాసభల నిర్వహణ కోసం కమిటీలు అహోరాత్రులు శ్రమించాయని, వినోదం, సంస్కృతి, వ్యాపారం, సాహిత్య రంగాలకు చెందిన అనేక వైవిధ్యభరితమైన కార్యక్రమాలను రూపొందించామని ఆయన తెలిపారు.
ఈ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది రాజకీయ, సినీ, సాహిత్య, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు విశిష్ట అతిథులుగా హాజరవుతున్నారని జయంత్ చల్లా వెల్లడించారు. అమెరికాలోని తెలుగువారందరూ ఒకే చోట చేరి మన సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెప్పేలా ఈ మహాసభలను పండగలా నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబసమేతంగా విచ్చేసి ఈ 19వ ఆటా మహాసభలను విజయవంతం చేయాలని, ఈ మెగా వేడుకలో భాగస్వాములు కావాలని ఆయన ఈ వీడియో ముఖంగా పిలుపునిచ్చారు.