
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19వ ATA కాన్ఫరెన్స్ & కన్వెన్షన్ సందర్భంగా ‘సయ్యంది పాదం-2026’ పేరుతో నృత్య పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు సోలో, గ్రూప్ విభాగాలతో పాటు శాస్త్రీయ, శాస్త్రీయేతర విభాగాల్లో జరగనున్నాయి. భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ, కథాకళి, మణిపురి, మోహినీఅట్టం వంటి నృత్యాలు, శాస్త్రీయేతర విభాగంలో సినిమా, జానపద, లైట్ మ్యూజిక్ పాటలపై ప్రదర్శనలుంటాయి. తొలుత అమెరికాలోని వివిధ నగరాల్లో సెమీఫైనల్స్ నిర్వహించనున్నారు. ఇందులో విజేతలను ఎంపిక చేస్తారు. సెమీఫైనల్స్లో విజయం సాధించిన వారు 2026 జులై 31, ఆగస్టు 1, 2 తేదీల్లో అమెరికాలోని బాల్టిమోర్లో జరిగే 19వ ATA కాన్ఫరెన్స్లో ఫైనల్లో పాల్గొంటారు. భారతీయ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నృత్య దర్శకులు ఫైనల్కు హాజరుకానున్నారు. ఈ పోటీలను తిలకించేందుకు పెద్దఎత్తున అమెరికాలోని తెలుగు ప్రజలు తరలిరావాలని నిర్వాహకులు కోరుతున్నారు.
