దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం’ ట్రైలర్ విడుదల వాయిదా పడింది. అంతర్జాతీయ పంపిణీ హక్కుల కోసం ప్రముఖ హాలీవుడ్ సంస్థ సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్తో ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా వెల్లడించారు.
శుక్రవారం ఉదయం విడుదల కావాల్సిన ట్రైలర్ను నిలిపివేసిన చిత్ర బృందం, ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించింది. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని ప్రపంచ ప్రేక్షకులకు మరింత విస్తృతంగా చేరవేయడమే ఈ భాగస్వామ్య లక్ష్యమని నమిత్ మల్హోత్రా తెలిపారు. అయితే ట్రైలర్కు కొత్త విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.
ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. అలాగే సన్నీ డియోల్, రవి దూబే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్కు ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు.
‘రామాయణం’ తొలి భాగం 2026 దీపావళి సందర్భంగా విడుదల కానుండగా, రెండో భాగం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా ఒప్పందం ప్రకారం సోనీ పిక్చర్స్ అంతర్జాతీయ పంపిణీ బాధ్యతలు నిర్వహించగా, దేశీయంగా ధర్మ ప్రొడక్షన్స్ చిత్రాన్ని విడుదల చేయనుంది.