అమెరికా రాజకీయ నాయకత్వ శిక్షణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అమెరికన్ లెజియన్ బాయ్స్ నేషన్ కార్యక్రమంలో తెలుగు యువకుడు క్రిష్ కొర్రపాటి చరిత్ర సృష్టించాడు. వాషింగ్టన్ డి.సి.లో నిర్వహించిన బాయ్స్ నేషన్ మాక్ పార్లమెంటరీ ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకుని ప్రవాస భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి ప్రశంసలు అందుకున్నాడు.
అమెరికాలోని 49 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కేవలం 100 మంది హైస్కూల్ సీనియర్ విద్యార్థులకు మాత్రమే బాయ్స్ నేషన్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. రాష్ట్ర స్థాయి బాయ్స్ స్టేట్ కార్యక్రమాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులే ఈ జాతీయ స్థాయి కార్యక్రమానికి ఎంపిక అవుతారు.
వారంరోజుల పాటు జరిగే ఈ నాయకత్వ శిక్షణలో విద్యార్థులు అమెరికా సెనెట్ తరహాలో మాక్ సమావేశాలు నిర్వహిస్తూ చట్టాల రూపకల్పన, విధాన చర్చలు, నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల్లో క్రిష్ కొర్రపాటి ఉపాధ్యక్షుడిగా ఎన్నికై విశేష గుర్తింపు పొందాడు.
గుంటూరు జిల్లా పల్లపాడు గ్రామానికి చెందిన కుటుంబం నుంచి వచ్చిన క్రిష్ కొర్రపాటి ప్రస్తుతం అమెరికాలో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందినవాడు. ఆయన డాక్టర్ మధు కొర్రపాటి, శిరీష దంపతుల మనవడు కాగా, డాక్టర్ వినీత్ కొర్రపాటి, స్మిత దంపతుల కుమారుడు.
ఈ విజయంతో క్రిష్ కొర్రపాటికి అమెరికా క్యాపిటల్ హిల్లో ఫెడరల్ అధికారులను కలిసే అవకాశం లభించడంతో పాటు, దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదికలను ప్రత్యక్షంగా అనుభవించే అరుదైన అవకాశం దక్కింది.
క్రిష్ సాధించిన ఈ ఘనత పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన తల్లి స్మిత తల్లిదండ్రులు గులివెందుల రమణమూర్తి, హేమలత తమ మనవడి విజయంపై ఆనందం వ్యక్తం చేశారు.
తెలుగు యువత అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభను చాటుకుంటున్న తరుణంలో, క్రిష్ కొర్రపాటి సాధించిన ఈ విజయం మరో స్ఫూర్తిదాయక ఘట్టంగా నిలిచింది.