అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొని ప్రవాస తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగించారు.
మహాసభలకు హాజరైన ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, కార్యదర్శి శ్రీధర్ బానాల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ రామసహాయం, సురేశ్ రెడ్డితో పాటు అమెరికా సహా వివిధ దేశాల నుంచి విచ్చేసిన ప్రతినిధులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ తెలుగు ప్రజల ఐక్యతకు ఆటా వేదికగా నిలుస్తోందని ప్రశంసించారు. అమెరికాలో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు తమ మూలాలను, మాతృభూమిని ఎప్పటికీ మరవొద్దని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మహాసభలకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ, అనివార్య కారణాలతో రాలేకపోయారని తెలిపారు. ఆయన తరఫున తాను, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ కార్యక్రమానికి హాజరయ్యామని పేర్కొన్నారు. అలాగే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా మహాసభల్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు.
ప్రవాస భారతీయులకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గుత్తా సుఖేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, సహాయ సహకారాల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని తెలిపారు. ప్రవాస తెలుగువారి సేవలు మాతృభూమి అభివృద్ధికి మరింత ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.