అమరావతి: ఈగోలకు దూరంగా ఉంటూ ప్రజల కోసం పనిచేసి నిజమైన ప్రజా సేవకులుగా నిలవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు పిలుపునిచ్చారు. గురువారం అమరావతిలో నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన పలు కీలక అంశాలపై అధికారులతో చర్చించారు.
సదస్సులో లీడర్షిప్, జీఎస్డీపీ, తాగునీరు, గృహ నిర్మాణం, జలధార, బెస్ట్ ప్రాక్టీసెస్ తదితర అంశాలపై చర్చ జరిగింది. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకుని పరిష్కరించేందుకు కలెక్టర్లు ప్రజలను నేరుగా కలవాలని సీఎం సూచించారు.
కేవలం రివ్యూలకే పరిమితం కాకుండా “రివ్యూల నుంచి రిజల్ట్స్ వైపు” అడుగులు వేయాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు ప్రజలకు స్పష్టంగా కనిపించేలా పనిచేయాలని సూచించారు.
“వన్ స్టేట్ – వన్ మిషన్ – వన్ ఎయిమ్” అనే లక్ష్యంతో అధికారులు సమన్వయంతో పనిచేసి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు