Find Articles

అమెరికాలో వైభవంగా ‘నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం’

అమెరికాలో వైభవంగా ‘నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం’

అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం, ‘ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్’ వేదికగా ఆరు రోజుల పాటు సాగిన ‘నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం’ పూర్ణాహుతితో వైభవంగా ముగిసింది. విశ్వశాంతి, లోక కల్యాణం మరియు సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక మహోత్సవానికి అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. నిత్యం గోపూజ, మహాన్యాస పారాయణంతో పాటు చండీ, రుద్ర, వారాహి, రాజశ్యామల హోమాలతో యాగశాల దివ్య తేజస్సుతో విలసిల్లింది. ముఖ్యంగా ఆలయ స్వచ్ఛంద సేవకులు స్వయంగా తయారుచేసిన 10 వేల మోదకాలతో నిర్వహించిన ‘దశసహస్ర మోదక హోమం’ యాగంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ముగింపు రోజున భక్తులు పవిత్ర కలశాలతో యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేసి, ఆ జలాలతో స్వామివారికి వైభవంగా మహా రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం దీక్షాధరులు అవభృత స్నానం ఆచరించారు. యాగ పూర్ణాహుతి సమయానికి వాన కురవడాన్ని పండితులు యాగ పరిపూర్ణతకు శుభసూచకంగా, దైవానుగ్రహంగా అభివర్ణించారు. ఆ రోజు సాయంత్రం 90 అడుగుల విశాల వేదికపై ఒకే ప్రాంగణంలో శ్రీ రాధాకృష్ణులు, సీతారాములు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివపార్వతులు, లక్ష్మీనరసింహ స్వామి, వేంకటేశ్వర స్వామివార్ల ‘షట్ కల్యాణ మహోత్సవం’ కనులపండువగా సాగింది. ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు వేలాదిగా భక్తులు పోటెత్తారు.

ఈ బృహత్తర యజ్ఞం విజయవంతం కావడానికి కృషి చేసిన వేద పండితులను, కమిటీ సభ్యులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. భక్తుల తోడ్పాటు, వాలంటీర్ల నిస్వార్థ సేవలు, పండితుల మంత్రోచ్ఛారణలే ఈ యాగ విజయంలో కీలక పాత్ర పోషించాయని యాగ కమిటీ చైర్మన్ గంగవరపు రజనీకాంత్ తెలిపారు. ఆరు రోజుల పాటు దాదాపు 25 వేల మందికి పైగా భక్తులకు మహాప్రసాద వితరణ చేయడం విశేషం. నిత్య వేద మంత్రాలు, దేవీదేవతల నామస్మరణలతో సాగిన ఈ మహాయజ్ఞం ఉత్తర అమెరికా గడ్డపై సనాతన ధర్మ వైభవాన్ని చాటుతూ చిరస్మరణీయంగా నిలిచింది.

ManaTV Team