
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా ఎన్నారై బీఆర్ఎస్ 12వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఇంచార్జ్ అనిల్ బైరెడ్డి సారథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గులాబీ శ్రేణులు, ప్రవాస భారతీయులతో పాటు మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున హాజరై సందడి చేశారు.
ఈ సందర్భంగా అనిల్ బైరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశా నిర్దేశంతో ఆస్ట్రేలియా వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆస్ట్రేలియాలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ వేడుకలు నిర్వహించి కేసీఆర్, కేటీఆర్ అభిమానులందరినీ ఒకే వేదికపైకి తెస్తామని స్పష్టం చేశారు. గత 12 ఏళ్లుగా పార్టీకి సేవలందించే అవకాశం కల్పించిన అధినేత కేసీఆర్, కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావులకు, అలాగే తనకు సహకరించిన కార్యవర్గ సభ్యులకు, ప్రవాస భారతీయులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ, ప్రాజెక్టు వాస్తవాలను వెల్లడించే ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. తెలంగాణ పదేళ్ల ప్రస్థానంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఊహించని అభివృద్ధిని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను అనిల్ బైరెడ్డి ఎండగట్టారు. కేసీఆర్ అందించిన సంక్షేమానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అప్పులు-స్కాములకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించిన ఆయన.. రానున్న రోజుల్లో కేసీఆర్ను మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులంతా కలిసికట్టుగా పనిచేస్తామని ప్రకటించారు.
కార్యక్రమంలో భాగంగా పలువురు ఎన్నారైలకు అనిల్ బైరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా బీఆర్ఎస్ కుటుంబంలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో అనిల్ బైరెడ్డితో పాటు సీనియర్ నాయకులు రమేష్ ముత్యాల, మధుపర్సా, రాహుల్ నడిదే, సత్య గుండా, రవీందర్ చుక్క, కార్తీక్, కుల్విందర్ గాజువా, స్వప్న, ప్రియాంక, మధులతో పాటు పలువురు ముఖ్య నేతలు, ఆస్ట్రేలియాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

