
టీటీఏ (తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్) 2026 మెగా కన్వెన్షన్ అమెరికాలోని చార్లెట్ నగరంలో అంగరంగ వైభవంగా సాగింది. ఈ వేడుకలో పాల్గొన్న ప్రముఖ వైద్యుడు డాక్టర్ మోహన్ రెడ్డి పట్లోళ్ల, టీటీఏ విజయ ప్రస్థానం వెనుక ఉన్న అసలు బలాలను వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేవలం 11 ఏళ్లలోనే నార్త్ అమెరికా తెలుగు సంఘాల్లో టీటీఏ ప్రత్యేక బ్రాండ్గా, నంబర్-1 సంస్థగా ఎదగడం యాదృచ్ఛికం కాదని ఆయన పేర్కొన్నారు. ఈ విజయానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని వెల్లడించారు.
మొదటిగా, సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి దూరదృష్టి, మార్గదర్శకత్వమే టీటీఏకు బలమైన పునాది వేసిందన్నారు. ఆయన ఆశీస్సులు, విలువలతోనే సంస్థ ఈ స్థాయికి చేరుకుందని కృతజ్ఞతలు తెలిపారు.
రెండవ కారణంగా, గత ఐదారు సంవత్సరాలుగా నిరంతరం శ్రమిస్తూ సంస్థ అభివృద్ధికి కీలకంగా నిలిచిన డాక్టర్ విజయపాల్ రెడ్డి సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. ఆయన అంకితభావం టీటీఏ ఎదుగుదలకు ప్రధాన బలమైందని పేర్కొన్నారు.
మూడవ కారణంగా, సంస్థలోని యువ నాయకత్వాన్ని డాక్టర్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రెసిడెంట్ నవీన్ మలిపెద్ది, కన్వీనర్ ప్రవీణ్ చింత, పాస్ట్ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి, భరత్తో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ఈసీ సభ్యుల సమిష్టి కృషి టీటీఏను మరింత బలోపేతం చేస్తోందని అన్నారు.
అమెరికాలోనే కాకుండా భారతదేశంలోనూ టీటీఏ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు, ఆసుపత్రి బెడ్లు అందించి సుమారు 200 మంది ప్రాణాలను కాపాడిందని చెప్పారు. ఈ సేవా కార్యక్రమాల్లో డాక్టర్ గురువా రెడ్డి అందించిన సహకారం చిరస్మరణీయమని కొనియాడారు.
టీటీఏ సేవా దృక్పథం, బలమైన నాయకత్వం, యువశక్తి కలిసి సంస్థను ప్రపంచ తెలుగు సమాజంలో అగ్రస్థానానికి తీసుకెళ్లాయని డాక్టర్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ప్రసంగానికి సభికుల నుంచి ఘనమైన చప్పట్లతో అభినందనలు లభించాయి.

