
అమెరికాలోని చార్లెట్లో జరుగుతున్న ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్’ మెగా కన్వెన్షన్ 2026లో టాలీవుడ్ సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా సందడి చేశారు. వీరిద్దరిని ఒకే వేదికపై చూడటమే అభిమానులకు పెద్ద విందు కాగా, వారిద్దరి మధ్య జరిగిన చర్చ ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఒకవేళ మీరు మీ ఐకానిక్ చిత్రం ‘శివ’ను మళ్ళీ తీస్తే, ఎవరిని హీరోగా ఎంచుకుంటారు? అని ఒక అభిమాని రామ్ గోపాల్ వర్మను అడగగా.. ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు. “శివ పాత్రలో నాగార్జున తప్ప మరొకరిని ఊహించుకోవడం కూడా కష్టమే” అని, ఆ సినిమాకు ఉన్న ప్రత్యేకతను గుర్తు చేశారు. అలాగే ఇద్దరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్నపై కూడా వర్మ రియాక్ట్ అయ్యారు. తనదైన శైలిలో నవ్వుతూ, “మేమిద్దరం కలిసి పనిచేస్తే సెట్స్లో గొడవలే జరుగుతాయి. ఎందుకంటే మా ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనా విధానాలు భిన్నంగా ఉంటాయి. చివరికి ఎవరో ఒకరు పూర్తి కంట్రోల్ తీసుకోవాల్సి వస్తుంది” అని సరదాగా వ్యాఖ్యానించారు.
ఈ వేదికపై ‘గురువు-శిష్యుడు’ అనే అంశంపై వర్మ స్పష్టత ఇచ్చారు. సందీప్ రెడ్డి వంగా తన శిష్యుడని అందరూ భావిస్తుంటారని, అయితే అది అపోహ మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు. “సందీప్ నా శిష్యుడు కాదు, నిజానికి నేను ఆయన సినిమాలను చూసి ఎంతో నేర్చుకుంటున్నాను” అని వర్మ ఒప్పుకోవడం విశేషం. దీనికి స్పందిస్తూ సందీప్ మాట్లాడుతూ, వర్మ గారి సినిమాలలోని ఎడిటింగ్, ప్రజంటేషన్ మరియు సినిమాటిక్ భాషను తాను నిరంతరం అధ్యయనం చేస్తుంటానని చెప్పుకొచ్చారు.
మొత్తంగా తమ సినిమాలపై అభిమానులు చూపిస్తున్న ప్రేమను చూసి ఈ ఇద్దరు దిగ్గజ దర్శకులు మురిసిపోయారు. కన్వెన్షన్ ప్రాంగణంలో వీరిద్దరి కాంబినేషన్ అభిమానులకు మరపురాని జ్ఞాపకాలను మిగిల్చింది.

