
అమెరికాలోని చార్లెట్ నగరం ఒక్కసారిగా తెలుగు సంస్కృతికి వేదికగా మారింది. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్–2026లో భాగంగా నిర్వహించిన శోభాయాత్ర ప్రవాస తెలుగువారిలో అపూర్వమైన ఉత్సాహాన్ని నింపింది. రంగురంగుల సంప్రదాయ వస్త్రాలు, బతుకమ్మలతో అలంకరించిన మహిళలు, డోలు-సన్నాయి వాయిద్యాల నడుమ సాగిన ఈ ప్రదర్శన కన్వెన్షన్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అమెరికా, భారత జాతీయ జెండాలను చేతబూని యువత భారీ సంఖ్యలో శోభాయాత్రలో పాల్గొన్నారు. టీటీఏ యూత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా అడుగులు కలిపారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగిన ఈ ప్రదర్శనను చూసేందుకు స్థానికులు కూడా ఆసక్తి కనబరిచారు.
ప్రవాస జీవితంలోనూ తమ మూలాలను మరువకుండా భావితరాలకు తెలుగు సంస్కృతిని పరిచయం చేయాలనే సంకల్పంతో ఈ శోభాయాత్రను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. బతుకమ్మలు, సంప్రదాయ దుస్తులు, సాంస్కృతిక కళారూపాలతో చార్లెట్ వీధుల్లో తెలుగు సంస్కృతి వైభవం ప్రతిధ్వనించింది.
టీటీఏ మెగా కన్వెన్షన్కు హాజరైన ప్రవాస తెలుగువారు కుటుంబ సమేతంగా ఈ శోభాయాత్రలో పాల్గొని ఐక్యతను చాటిచెప్పారు. కన్వెన్షన్ ప్రారంభ వేడుకలకు ఈ శోభాయాత్ర మరింత ప్రత్యేకతను తీసుకువచ్చి, తెలుగు సంస్కృతి గొప్పతనాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి ఆవిష్కరించింది.

