కర్ణాటకలోని బెళగావిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఫ్రిజ్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
వినాయక చవితి వేడుకలు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రిజ్ పేలిన వెంటనే ఇంట్లో మంటలు వేగంగా వ్యాపించడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది.
ఈ ప్రమాదంలో గజానన్ ధామోన్ (65), శారద (45), భారతి (50), రోషన్ (21) మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఫ్రిజ్ పేలడానికి గల అసలు కారణం ఏమిటనే దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి విద్యుత్ లోపమా, గ్యాస్ లీకేజీనా లేదా ఇతర కారణాలున్నాయా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.