తమిళనాడులో అధికారం చేపట్టిన నాటి నుంచి సీఎం విజయ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనలో తనదైన మార్క్ వేస్తున్నారు. తాజాగా అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. అవినీతికి పాల్పడుతున్న అధికారులను పట్టిస్తే రూ. లక్ష బహుమతి అందిస్తానని ప్రకటించారు.
రాష్ట్రంలో అవినీతిని సమూలంగా రూపుమాపేందుకు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో సామాన్య ప్రజలను సైతం భాగస్వాములను చేయడం విశేషం. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా సరే రూ.వెయ్యి లంచం అడిగినా.. ఆ విషయాన్ని సాక్ష్యాధారాలతో ప్రభుత్వానికి పట్టించాలని చెప్పారు. ఇలా చేసిన ప్రజలకు ఏకంగా రూ. లక్ష నగదు బహుమతి అందిస్తామని ప్రకటన చేశారు. అంటే సామాన్య ప్రజలనే అవినీతి నిరోధక సైన్యంగా మార్చారన్న మాట.
లంచం అడిగే అధికారులపై ప్రజలు ధైర్యంగా ఫిర్యాదు చేయడం కోసం 24 గంటలూ అందుబాటులో ఉండేలా 1800 425 1555 అనే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ను కూడా ప్రవేశపెట్టింది. రాబోయే మూడు నెలల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని వంద శాతం తుడిచిపెట్టేస్తామని ఈ సందర్భంగా సీఎం విజయ్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన తీసుకున్న ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.