Find Articles

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో మొత్తం 24 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు జూన్ 18న పోలింగ్ జరగనుండగా, అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది.

జూన్, జూలై నెలల్లో పదవీకాలం ముగిసి, రిటైర్ కానున్న సభ్యుల స్థానాలను భర్తీ చేయడానికి ఈ ఎన్నికలను నిర్వహించనుంది. దీనికి సంబంధించి జూన్ ఒకటిన నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్ 8 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ. జూన్ 9న నామినేషన్ల పరిశీలన. జూన్ 11 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఇక జూన్ 18 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనుంది. జూన్ 20 నాటికి ఈ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.

కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం.. ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఏపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానీల పదవీకాలం జూన్ 21తో ముగియనుంది. అలాగే కర్ణాటకలో 4 స్థానాలు, గుజరాత్ లో 4 స్థానాలు, మధ్యప్రదేశ్ లో 3 స్థానాలు, జార్ఖండ్ లో 2 స్థానాలతో పాటు మణిపూర్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుండి ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు అధికారులు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి ప్రత్యేక పరిశీలకులను రంగంలోకి దించుతున్నట్లు ఈసీ తెలిపింది.

ManaTV Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *