Find Articles

ఆ ధైర్యం ఎవరికీ లేదు..డైరెక్టర్ హెచ్ వినోద్ సెన్సేషనల్ కామెంట్స్.. మరోసారి తెరపైకి ‘ జన నాయగన్ ’ రిలీజ్ వివాదం

ఆ ధైర్యం ఎవరికీ లేదు..డైరెక్టర్ హెచ్ వినోద్ సెన్సేషనల్ కామెంట్స్.. మరోసారి తెరపైకి ‘ జన నాయగన్ ’ రిలీజ్ వివాదం

తమిళనాడు సీఎం విజయ్ నటించిన ఆఖరి చిత్రం ‘ జన నాయగన్’. గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల ఆలస్యంపై చిత్ర దర్శకుడు హెచ్ వినోద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

తాజాగా జరిగిన ఓ మూవీ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న డైరెక్టర్ వినోద్ కీలక వ్యాఖ్యలు చేశారు.తమిళనాడు మొత్తం ఎదురుచూస్తున్న ‘ జన నాయగన్’ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది.? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు.‘‘ ఆ విషయం నా చేతుల్లో లేదు. అసలు ఏం జరుగుతుందో .? ఆ నిజాన్ని మీతో పంచుకునేంత ధైర్యం నాకు లేదు. ఒకవేళ నేను ధైర్యం చేసి నిజం చెప్పినా, దాన్ని బయట ప్రపంచానికి చూపించే ధైర్యం మీకు కూడా ఉండదు’’ అని చెప్పారు.దీంతో ఈ సినిమా రిలీజ్ ఆలస్యం వెనుక రాజకీయ, సెన్సార్ ఒత్తిళ్లు ఉన్నాయనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి.

రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం చుట్టూ అనేక వివాదాలు నడుస్తున్నాయి. నిజానికి జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ మూవీలో మతపరమైన సెంటిమెంట్లు, సాయుధ దళాలపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టులు సానుకూలంగా స్పందించినప్పటికీ, రీ -వెరిఫికేషన్ ల కమిటీల ఆలస్యంతో సర్టిఫికేట్ ప్రక్రియ పూర్తి కాలేదు.ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన హీరో విజయ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఈ సినిమా కష్టాలన్నీ తీరిపోతాయని అంతా భావించారు. కానీ జన నాయగన్ చిత్రానికి ఇంకా సెన్సార్ లైన్ క్లియర్ కాలేదు. దీంతో ఈ సినిమా విడుదల ఎప్పుడనేది ప్రశ్నార్థకంగా మారింది.

ManaTV Team