
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) 2026-2028 కి గాను, తన నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC)ని ప్రకటించింది. NATS బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సంస్థను మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు, సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు మరియు సభ్యులతో అనుబంధాన్ని బలోపేతం చేయేందుకు రాజ్ అల్లాడాను అధ్యక్షుడిగా ఎన్నుకుంది.
అనుభవం, యువ నాయకత్వం, సేవా దృక్పథం కలగలిసిన ఈ నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా రాజ్ అల్లాడ, వైస్ ప్రెసిడెంట్ (ప్రోగ్రామ్స్)గా రాజేష్ కండ్రు, వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్)గా అనుదీప్ అర్లా, వైస్ ప్రెసిడెంట్ (సర్వీసెస్)గా రాజ్యలక్ష్మి చిలుకూరి, కార్యదర్శిగా సుధీర్ మిక్కిలినేని, ఖజాంచీగా రామ్ నరేష్ కొమ్మనబోయిన, జాయింట్ సెక్రటరీగా భాను లంక, జాయింట్ ట్రెజరర్గా వెంకట సాకమూరి బాధ్యతలు చేపట్టనున్నారు. వీరందరూ తమ తమ రంగాల్లో విశేష అనుభవంతో పాటు NATS పట్ల అంకితభావంతో పనిచేస్తూ సంస్థ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లనున్నారు.
న్యూజెర్సీకి చెందిన టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ రాజ్ అల్లాడ 2009 నుంచి NATSలో వాలంటీర్గా సేవలందిస్తున్నారు. సంస్థలో పలు బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు పలుమార్లు NATS బోర్డ్ మెంబర్ గా వ్యవహరించారు. ముఖ్యంగా సేవా కార్యక్రమాల పట్ల ఆయన చూపిన నిబద్ధత, కమ్యూనిటీకి ఉపయోగపడే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనే తపన ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
2023లో డిప్యూటీ కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించిన రాజ్ అల్లాడ, న్యూజెర్సీలో జరిగిన NATS సంబరాల్లో కీలక పాత్ర పోషించారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్నారు. నిధుల సేకరణలో ఆయన చూపిన చొరవ, వాలంటీర్లను ఒకే లక్ష్యంతో ముందుకు నడిపించిన తీరు, సేవా కార్యక్రమాలపై ఉన్న అంకితభావం సభ్యుల్లో విశేష గుర్తింపు తీసుకొచ్చాయి.
దాదాపు రెండు దశాబ్దాలుగా NATSకు అందిస్తున్న సేవలను, ఆయన నాయకత్వ సామర్థ్యాన్ని గుర్తించిన సంస్థ ఇప్పుడు ఆయనను అధ్యక్ష పదవికి ఎంపిక చేసింది. రాజ్ అల్లాడ నాయకత్వంలో NATS మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టి, సభ్యుల భాగస్వామ్యాన్ని పెంచుతూ, సేవే లక్ష్యంగా ముందుకు సాగుతుందనే విశ్వాసాన్ని సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
ఎంపిక కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా, పలు అంశాలను పరిశీలించిన అనంతరం NATS బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎంపిక చేసింది. ఈ సందర్భంగా NATS బోర్డ్ ఛైర్మన్ శ్రీ కిషోర్ కంచర్ల, నూతన అధ్యక్షుడు రాజ్ అల్లాడతో పాటు మొత్తం కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. సేవా దృక్పథం, అంకితభావం, స్పష్టమైన లక్ష్యాలతో ఈ బృందం సంస్థను మరింత ముందుకు తీసుకెళ్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. 2026-2028 లో రాజ్ అల్లాడ నాయకత్వంలోని నూతన కార్యవర్గం విజయవంతంగా పనిచేసి సంస్థకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని NATS బోర్డ్ ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేసింది.

