తెలంగాణ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని పదేళ్లు పెంచింది. ఇకపై 34 సంవత్సరాలకు బదులుగా 44 సంవత్సరాల వయస్సు వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అర్హులు. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో నంబర్ 86 ను జారీ చేసింది.అయితే ఈ పెరిగిన వయోపరిమితి శాశ్వతం కాదు. ఏడాది కాలం పాటు మాత్రమే అమలులో ఉంటుంది.
2024 ఫిబ్రవరి 8న జారీ చేసిన జీవో నంబర్ 30 ప్రకారం వయోపరిమితిని 10+2 సంవత్సరాలు పెంచి, 46 ఏళ్లకు చేర్చింది. అది రెండేళ్ల పాటు అమలులో ఉంటుంది.ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన జీవో నంబర్ 30 ప్రకారం కాలపరిమితి ముగిసింది. దీంతో ప్రత్యక్ష నియామకాలకు గరిష్ట వయోపరిమితి తిరిగి 34 ఏళ్లకు తగ్గింది. ఈ నేపథ్యంలో జీవో 86 ను జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.నిరుద్యోగ యువత నుండి అందిన విజ్ఞప్తుల నిశితంగా పరిశీలించిన తర్వాత తాజా నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ రావు తెలిపారు.
ఈ జీవోలో యూనిఫాం సర్వీసులను మినహాయించారు. పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక దళం, జైళ్లు, అటవీ శాఖల్లో ఉద్యోగాలను ఇందులో నుంచి మినహాయించారు. ఆయా శాఖల్లో ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థుల వయోపరిమితి 34 సంవత్సరాలుగానే కొనసాగుతుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే యూనిఫాం రహిత పోస్టుల నియామకాలకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుంది.