
ప్రముఖ సినీ దర్శకుడు భారతీరాజా (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్ భారతీయ సినీ పరిశ్రమ లో తీవ్ర విషాదం నెలకొంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మరీ ముఖ్యంగా తమిళ, తెలుగు సినిమా రంగాల్లో భారతీ రాజా తనదైన ముద్ర వేశారు. సహజమైన పల్లెటూరి పచ్చదనం, గ్రామీణ సంస్కృతిని వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడిగా ఆయన పేరుగాంచారు. ఆయన తీసిన సినిమాలు కేవలం ప్రేమ చుట్టూ తిరిగేవి మాత్రమే కాదు. కుల వివక్ష, మహిళల సమస్యలు, సామాజిక అసమానతలు, గ్రామీణ జీవన విధానం, కుటుంబ బంధాలు వంటి పలు అంశాలను ఆయన చూపించేవారు. ఆడియెన్స్ కు ఒక నిజ జీవితాన్ని చూస్తున్నామా.? అనే అనుభూతిని కలిగించేవారు.
భారతీరాజా అసలు పేరు చిన్నస్వామి. ఆయన 1941 జూలై 17న తమిళనాడులోని తేని సమీపంలో ఉన్న అల్లినగరం అనే గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచే కళలు, నాటకాలపై ఉన్న విపరీతమైన ఆసక్తి సినీ రంగంవైపు అడుగులు వేసేలా చేసింది. 1977లో వచ్చిన ‘పదునారు వయదినిలే’ (తెలుగులో ‘పదహారేళ్ళ వయసు’) సినిమాతో భారతీరాజా దర్శకుడిగా పరిచయమయ్యారు. తరువాత ఆయన డైరెక్షన్ లో వచ్చిన సీతాకోకచిలుక సినిమా తెలుగు చిత్ర చరిత్రలోనే క్లాసిక్ గా నిలిచిపోయింది. దాదాపు నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 40 కి పైగా సినిమాలను తీసి ఎంతోమంది నూతన దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారు.
తెలుగులో సీతాకోక చిలుక, కొత్త జీవితాలు, జమదగ్ని, ఆరాధన వంటి చిత్రాలను తెరకెక్కించారు భారతీరాజా. సీతాకోక చిలుక మూవీకి నంది అవార్డును సైతం అందుకున్నారు. మంగమ్మగారి మనవడు చిత్రానికి కథను, పల్నాటి పౌరుషం సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. అంతేకాదు సినీ ఇండస్ట్రీకి ఎంతో మంది నటీనటులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేసిన ఘనత భారతీరాజాకు దక్కుతుంది. శ్రీదేవి, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి స్టార్లకు కెరీర్ బ్రేక్ ఇచ్చిన చిత్రాలు ఆయనే తీశారు. రాధిక, రేవతి, రాధ, విజయశాంతి వంటి నటీమణులను సినిమా రంగానికి పరిచయం చేసింది కూడా ఆయనే కావడం విశేషం.

