టాలీవుడ్ నటుడు మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనిక రెడ్డి సామాజిక సేవా రంగంలోకి అడుగుపెట్టారు. తమ పుట్టినరోజుల వేడుకలకు ముందుగా సామాజిక సేవతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్న ఈ దంపతులు ‘ఐక్య… ధైర్య సేన సమితి’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈ విషయాన్ని మంచు మనోజ్ స్వయంగా ప్రకటిస్తూ, సంస్థ లోగోను ఆవిష్కరించారు.
“జీవితంలోని ఒడిదొడుకులు మాకు మానవత్వమే ముఖ్యమని నేర్పాయి. సేవ చేయాలనే స్ఫూర్తి ఈరోజు కొత్తగా మొదలైంది కాదు. అది ఎప్పుడూ మాతోనే ఉంది. ఇప్పుడు ఆ స్ఫూర్తికి ఒక పేరు పెట్టి, మాతో కలిసి నడిచేందుకు మరిన్ని హృదయాలను ఆహ్వానిస్తున్నాం” అని మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తన భార్య మౌనిక ఆలోచనతోనే ఈ సంస్థకు శ్రీకారం చుట్టినట్లు ఆయన భావోద్వేగంగా వెల్లడించారు. ఐక్య అంటే ఐకమత్యమన్న ఆయన మానవత్వం కోసం అందరూ ఏకం కావడమని చెప్పారు. భగవంతుడు తమకు ప్రసాదించిన దానిలో కొంత భాగాన్ని సేవ రూపంలో పంచుకోవాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. రక్తదానం, అత్యవసర సహాయం వంటి కార్యక్రమాల ద్వారా అవసరమైన ప్రతిచోటా ‘ఐక్య’ అండగా నిలుస్తుంది” అని మనోజ్ వివరించారు.