అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19వ ఆటా మహాసభలు మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్లో శుక్రవారం సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఈ ప్రతిష్ఠాత్మక మహాసభలకు అమెరికా నలుమూలల నుంచి తెలుగు ప్రముఖులు, సామాజిక నాయకులు, రాజకీయ ప్రతినిధులు, కళాకారులు, వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన ప్రారంభోత్సవంలో జ్యోతి ప్రజ్వలనతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. చీకటి నుంచి వెలుగువైపు, అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు సమాజం పయనించాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులు మహాసభలను ప్రారంభించారు. ఆటా కోర్ కమిటీ సభ్యులతో పాటు పలువురు విశిష్ట అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్, ఆటా వ్యవస్థాపక సభ్యుడు హనుమంత రెడ్డి, ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బనాల, రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు.
మహాసభల నిర్వహణలో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బనాల, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న సతీష్ రామసహాయం రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జయంత్ చల్లా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒకే వేదికపైకి తీసుకురావడం, యువతలో సేవా భావాన్ని పెంపొందించడం, అమెరికాలో తెలుగు సమాజ ప్రాధాన్యతను మరింత బలోపేతం చేయడం ఆటా మహాసభల ప్రధాన లక్ష్యమని తెలిపారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ఆటా నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
మహాసభల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ తన ప్రసంగంలో ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం ఎంతో కీలకమని అన్నారు. భావితరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ పౌర బాధ్యతలను నిర్వర్తించాలని, ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొని సమాజ భవిష్యత్తును నిర్మించడంలో తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
అమెరికాలోని వలస సమాజాలు, ముఖ్యంగా దక్షిణాసియా మరియు తెలుగు సమాజం రాజకీయంగా మరింత చైతన్యంతో ముందుకు రావాలని, ప్రజా జీవితంలో చురుకైన భాగస్వామ్యం ద్వారా భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని అరుణా మిల్లర్ ఆకాంక్షించారు.
మూడు రోజుల పాటు కొనసాగే ఈ మహాసభల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య వేదికలు, యువజన, మహిళా, వ్యాపార సదస్సులు, పూర్వ విద్యార్థుల సమావేశాలు, వినోద కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రపంచ తెలుగు సమాజ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న ఈ మహాసభలు తెలుగు సంస్కృతి వైభవాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి చాటనున్నాయి.
అమెరికాలోని బాల్టిమోర్లో జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభల్లో భాగంగా నిర్వహించిన యూత్ కన్వెన్షన్లో ఆటా కోఆర్డినేటర్…
అమెరికాలో 35 ఏళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో…
అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ…
అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు, యూత్ కన్వెన్షన్ అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచం…
అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరంలో ఘనంగా జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) మహాసభలు, యువజన సమ్మేళనంలో…
అమెరికా తెలుగు సంఘం (ATA) ఆధ్వర్యంలో బాల్టిమోర్లో నిర్వహించనున్న 19వ మహాసభల్లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, కళారూపాలకు విశేష ప్రాధాన్యం…