– మోదీ పొదుపు చర్యల పిలుపు ఎఫెక్ట్
– టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం
– మహానాడు నిర్వహణను రద్దుపై తర్జనభర్జన
పశ్చిమాసియా ఉద్రిక్తతలు సృష్టించిన సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎఫెక్ట్ టీడీపీ మహానాడుపై కూడా పడింది. ఈ క్రమంలోనే మహానాడు నిర్వహణపై టీడీపీ అధిష్టానం తర్జనభర్జన పడుతోంది.
ప్రతీ సంవత్సరం టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మహానాడు నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కార్యకర్తలు హాజరవుతారు. అయితే, ప్రధాని మోదీ కీలక పిలుపు, రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో, ప్రభుత్వం ఓవైపు పొదుపు మంత్రం జపిస్తూ.. మరోవైపు పార్టీ పరంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి భారీ పండుగలా మహానాడు నిర్వహించడం సరికాదనే భావనలో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఈసారి మహానాడు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన పొదుపును ప్రోత్సహించేలా వినూత్న నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో వారానికి ఒక రోజు నో వెహికల్ డే పాటించాలని కీలక పిలుపునిచ్చారు. అంటే ఆ రోజున ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ వాహనాలను వాడకుండా పొదుపు చర్యల్లో భాగస్వాములు కానున్నారని తెలుస్తోంది.