టీడీపీ మహానాడు ఏర్పాట్లపై పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అధ్యక్షతన పొలిట్బ్యూరో సమావేశం జరిగింది. మే 27, 28 తేదీల్లో హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమ అజెండాపై నేతలకు ఆయన కీలక దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశానికి ఉండవల్లిలోని నివాసం నుంచి చంద్రబాబు వర్చువల్గా హాజరవగా, ఇతర నేతలు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి పాల్గొన్నారు. ఉదయం 9 గంటల నుంచే కార్యక్రమాలు ప్రారంభించాలని, ప్రతి వక్త తమకు కేటాయించిన అంశంపైనే సూటిగా, స్పష్టంగా మాట్లాడాలని చంద్రబాబు ఆదేశించారు. మొత్తంగా మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీకి మహిళలు, బీసీలు రెండు కళ్ల లాంటివారని చంద్రబాబు తెలిపారు. “మహిళలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని అందరికీ అర్థమయ్యేలా చాటాలని, జనాభాలో 50 శాతం ఉన్న బీసీలు పార్టీ ఆవిర్భావం నుంచీ మనకు వెన్నుదన్నుగా ఉన్నారని పేర్కొన్నారు. వారి అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందనే సందేశం స్పష్టంగా వెళ్లాలని నేతలకు చంద్రబాబు సూచించారు. “కార్యకర్తే అధినేత” అనే నినాదం మహానాడులో స్పష్టంగా ప్రతిబింబించాలని, పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకును జాగ్రత్తగా కాపాడుకోవాలని స్పష్టం చేశారు.
అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు మంత్రం నేపథ్యంలో, ఈసారి మహానాడును మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అగ్రనేతలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక పైనుంచి ప్రసంగించనుండగా, పార్టీ క్యాడర్ కోసం రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.