నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన తన చిరకాల కోరికను బయటపెట్టారు. తన ఆరాధ్య దైవం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్తో ప్రపంచమంతా ఉలిక్కిపడేలా ఒక భారీ చిత్రాన్ని నిర్మించాలని, ఆ సినిమా తర్వాత తన ‘పరమేశ్వర ఆర్ట్స్’ బ్యానర్ను శాశ్వతంగా మూసివేస్తానని సంచలన ప్రకటన చేశారు.
ఇటీవల ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేశ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవన్ కల్యాణ్ను ‘పవనేశ్వరా’ అంటూ దేవుడిలా ఆరాధించే ఆయన, తన దేవుడితో మరో సినిమా తీయాలన్నదే తన జీవితాశయమని తెలిపారు. నాకు ఒక కోరిక ఉంది. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్లో మళ్లీ పవన్ కల్యాణ్ తో సినిమా తీయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఉలిక్కిపడే విధంగా సినిమా తీసి ఆ బ్యానర్ను ఆపేయాలన్నది నా కోరిక” అని బండ్ల గణేష్ తన కోరికను బయటపెట్టారు.
మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఎప్పుడు చేస్తారని అడగ్గా, ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నట్లు బండ్ల గణేష్ తెలిపారు. ఏడు కొండలవాడు ఆ రోజు ఎప్పుడు ఇస్తాడో చూడాలని, ఆయనతో ఏదో ఊరికే సినిమా తీస్తే ఉపయోగం లేదని చెప్పారు. 30 ఏళ్ల తర్వాత కూడా మా పిల్లలు గర్వంగా చెప్పుకునేలా బ్లాక్బస్టర్ కథతో సినిమా చేయాలని పేర్కొన్నారు. ‘గబ్బర్ సింగ్’ వచ్చి 14 ఏళ్లైనా ఇంకా మాట్లాడుకున్నట్టే, చిరంజీవితో సినిమా కూడా చరిత్రలో నిలిచిపోవాలి” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.