Find Articles

వ్యక్తిగత రికార్డుల కన్నా జట్టు గెలుపే ముఖ్యం ..వైభవ్ సూర్యవంశీ

వ్యక్తిగత రికార్డుల కన్నా జట్టు గెలుపే ముఖ్యం ..వైభవ్ సూర్యవంశీ

రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన బ్యాటింగ్ తోనే కాదు మాటలతోనూ ఆకట్టుకుంటున్నారు. వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు విజయానికే తాను అధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఈ స్ఫూర్తి తనకు తన తండ్రి నుంచి వచ్చిందని స్పష్టం చేశారు.

చిన్నప్పటి నుంచి తన తండ్రి ఒకే మాట చెప్పేవారు. సెంచరీ, డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ చేసినా.. ఆ పరుగుల వల్ల జట్టు గెలవకపోతే అవి వ్యర్థం. అవి కేవలం వ్యక్తిగత రికార్డులకు పనికొస్తాయి తప్ప జట్టుకు ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పేవారు. అందుకే, గెలిపించలేని సెంచరీ కంటే, జట్టును గెలిపించే 80 పరుగులే ఎక్కువ విలువైనవి అని వైభవ్ తెలిపారు. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మూడు పరుగుల తేడాతో సెంచరీ చేజారినప్పటికీ, తన దృక్పథం మారలేదని వెల్లడించారు.

ఈ ఐపీఎల్ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. 15 ఇన్నింగ్స్‌లలో 242.86 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసకర బ్యాటింగ్ చేస్తూ 680 పరుగులు సాధించారు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచారు. ఈ క్రమంలో 65 సిక్సర్లు బాదిన వైభవ్, ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు, 200కు పైగా స్ట్రైక్ రేట్‌తో 600కు పైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించారు.

ManaTV Team