Find Articles

భారతీరాజాకు అధికారిక వీడ్కోలు.. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం

భారతీరాజాకు అధికారిక వీడ్కోలు.. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం

భారత చలనచిత్ర దర్శకుడు భారతీరాజా అంత్యక్రియలను తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది. ఈ మేరకు సీఎం జోసెఫ్ విజయ్ కీలక ప్రకటన చేశారు. తమిళ చిత్ర పరిశ్రమలకు ఆయన అందించిన అసమాన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

భారతీరాజాకు అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలకాలని తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తికి విజయ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంతకుముందు టీఎఫ్ఏపీఏ సీఎంకి ఒక రిక్వెస్ట్ చేస్తూ, తమ వ్యవస్థాపకుడైన భారతీరాజాకు ప్రభుత్వ గౌరవం కల్పించాలని కోరింది. దీనిపై వెంటనే స్పందించిన సీఎం విజయ్, ప్రభుత్వ గౌరవ వందనంతో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని హామీ ఇచ్చారు. అంతకముందు భారతీరాజాకు సీఎం విజయ్ ఘన నివాళులర్పించారు. ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా అంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

2020లో నిర్మాతల సంక్షేమం కోసం భారతీరాజా ముందుండి ‘తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ను స్థాపించారు. ఆయన నాయకత్వ పటిమతోనే ఈ సంఘం నేడు 400 మందికి పైగా క్రియాశీల నిర్మాతలతో బలంగా ఉంది. భారతీరాజాను స్మరించుకున్న అసోసియేషన్.. నిర్మాతలు, దర్శకులు, నటీనటుల సంక్షేమం కోసం ఆయన నిరంతరం తపించారని పేర్కొంది. భారతీయ చలనచిత్ర రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన దార్శనికుడు భారతీరాజా అని కొనియాడింది.

ManaTV Team