
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంపై సందిగ్ధత నెలకొంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్న ఈ 15 ఏళ్ల కుర్రాడి అరంగేట్రం ఐర్లాండ్ సిరీస్లోనే జరగవచ్చని అంతా భావించారు. కానీ, ఆ దేశంలో సామాజిక అశాంతి, అల్లర్లు చెలరేగాయి. దీంతో అసలు సిరీస్ జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఐర్లాండ్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే లిస్బన్లో జరగాల్సిన ఇంటర్-ప్రొవిన్షియల్ టీ20 ఫెస్టివల్ క్యాన్సిల్ అయింది. ఈ నేపథ్యంలో 14న జరగాల్సిన ఐరిష్ సీనియర్ కప్, నేషనల్ కప్ మ్యాచ్ల నిర్వహణపై రాబోయే 48 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని క్రికెట్ ఐర్లాండ్ తెలిపింది. ప్రస్తుతం అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, ప్లేయర్స్, కోచ్లు, అధికారులు, మద్దతుదారుల భద్రతే తమకు ముఖ్యమని పేర్కొంది. ఒకవేళ పరిస్థితులు అదుపులోకి రాకపోతే భారత్-ఐర్లాండ్ సిరీస్పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.
అంతర్జాతీయ అరంగేట్రం జరగాల్సిన సిరీస్పై అనిశ్చితి నెలకొనప్పటికీ, వైభవ్ సూర్యవంశీ మాత్రం తన ఆటతీరును మరింత మెరుగుపరుచుకునే పనిలో పడ్డారు. ఐర్లాండ్లో పరిస్థితులు త్వరగా చక్కబడాలని, ఈ యువ సంచలనం అరంగేట్రం చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

