
బెంగళూరు (వైట్ఫీల్డ్): పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని రూపాయి ఖర్చు లేకుండా అందిస్తూ, మానవసేవే మాధవసేవగా సాగుతున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సేవా యజ్ఞంలో మరో కీలక మైలురాయి నమోదైంది. బెంగళూరు వైట్ఫీల్డ్లోని ‘శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్’ (SSSIHMS) ఆసుపత్రిలో దాదాపు రూ. 6.76 కోట్ల విలువైన అత్యాధునిక వైద్య సాంకేతిక పరికరాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్ ప్రారంభించారు.
శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రత్యక్ష నిధులతో పాటు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఫౌండేషన్, జి.ఇ. వెర్నోవా (యునైటెడ్ వే బెంగళూరు ద్వారా), హ్యాపీ రిలయబుల్ సర్జరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) భాగస్వాముల సహకారంతో ఈ అత్యాధునిక పరికరాలను ఆసుపత్రిలోని వివిధ విభాగాలలో సమకూర్చారు.
ప్రారంభించిన ముఖ్యమైన వైద్య పరికరాలు:
కార్డియాక్ కేర్: గుండె ఆపరేషన్ల కోసం ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఫౌండేషన్ సౌజన్యంతో అందించిన అత్యాధునిక ‘లివానోవా ఎస్సెంజ్ పల్స్ హార్ట్-లంగ్ మెషీన్లు’ (Heart-Lung Machines). వీటి ద్వారా ఇప్పటికే పలు సంక్లిష్టమైన గుండె సర్జరీలు విజయవంతంగా జరిగాయి.
ఐసీయూ అప్గ్రేడ్: కరోనరీ కేర్ (CCU), ఐసీయూ (ICU) విభాగాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన కొత్త తరం పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్స్, డీఫిబ్రిలేటర్లు.
డిజిటల్ పాథాలజీ: రిమోట్ రిపోర్టింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతకు అనుసంధానించేలా ‘మార్ఫిల్ హోల్ స్లైడ్ ఇమేజింగ్ డిజిటల్ పాథాలజీ సిస్టమ్’. దీని ద్వారా నిపుణులైన డాక్టర్లు ఎక్కడ ఉన్నా ఆన్లైన్ ద్వారా రిపోర్టులను పరిశీలించవచ్చు.
ఇతర విభాగాలు: ఎముకల సర్జరీల కోసం కంప్యూటర్ ఆధారిత ‘knee navigation platform’, ఆర్థోపెడిక్ పవర్ టూల్స్, కంటి వైద్యానికి సంబంధించిన అడ్వాన్స్డ్ బయోమీటర్, ఈఎన్టీ (ENT) మైక్రోడెబ్రైడర్ సిస్టమ్, న్యూరో సర్జరీ పరికరాలు మరియు బహుళ విభాగాల శస్త్రచికిత్సలకు ఉపయోగపడే ఎలక్ట్రో-హైడ్రాలిక్ ఆపరేటింగ్ టేబుల్.
డిజిటల్ క్లాస్ రూమ్స్: వైద్య విద్యార్థుల శిక్షణ, అడ్మినిస్ట్రేటివ్ సమావేశాల కోసం ఇంటరాక్టివ్ డిజిటల్ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు

