
టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో స్టార్ హీరోగా కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన ఆయన నిజ జీవితంలోనూ మానవతావాదిగా నిలుస్తున్నారు. తాజాగా తాను ఎప్పటికీ ప్రజల మనిషినేనని పవన్ నిరూపించుకున్నారు.
వరంగల్ – హనుమకొండకు చెందిన 17 ఏళ్ల నిరంజన్ అనే యువకుడు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. మరణంతో పోరాటం చేస్తున్న నిరంజన్ తన అభిమాన హీరో పవన్ కల్యాణ్ ను ఒక్కసారైనా కళ్లారా చూడాలని ఆశపడ్డారు. పవన్ ను కలవాలనే ఆయన ఆఖరి కోరికకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయం చివరకు పవన్ కల్యాణ్ దృష్టికి చేరింది.
ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ హనుమకొండకు వచ్చారు. హనుమాన్ నగర్ లోని నిరంజన్ నివాసానికి వెళ్లి నిరంజన్ ను ఆప్యాయంగా పలకరించారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం అతడి చేతిని ముద్దాడుతూ సెల్ఫీ కూడా తీసుకున్నారు. రాష్ట్ర డిప్యూటీసీఎం, స్టార్ హీరో స్వయంగా తమ ఇంటికి రావడంతో నిరంజన్ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. పవన్ రాకతో ఆ పరిసర ప్రాంతాల్లో అభిమానుల కోలాహలం కనిపించింది. అలాగే జై పవన్, జై జనసేన నినాదాలతో మారుమోగిపోయింది.
పవన్ చూపిన మానవత్వానికి స్ఫూర్తి పొందిన ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ కూడా స్పందించారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరపున నిరంజన్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. వరంగల్-హనుమకొండకు చెందిన 17 ఏళ్ల బాలుడు పౌనుగోటి నిరంజన్ తీవ్రమైన కిడ్నీ సమస్యతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుండటం బాధాకరం. చాలా కాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలవాలనే నిరంజన్ కోరిక నెరవేరడం హృదయాన్ని కదిలించింది. పవన్ కళ్యాణ్ భక్తుడిగా, ఆయన స్ఫూర్తితో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరఫున నిరంజన్కు, అతని కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నాను’ అంటూ బండ్ల గణేష్ పేర్కొన్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ ఆప్యాయత, మరోవైపు బండ్ల గణేష్ ఆర్థిక సాయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

