– తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా పండుగ
– క్యాడర్ కు కల్వకుంట్ల కవిత కీలక ఆదేశాలు
– పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలని సూచన
తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత జెండా పండుగ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.పార్టీని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లడమే లక్ష్యంగా వ్యూహారచన చేస్తున్న ఆమె నెల రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 20 నుంచి నెల రోజుల పాటు అంటే జూన్ 20 వరకు భారీ జెండా పండుగ నిర్వహించాలని పార్టీ కార్యకర్తలకు కవిత పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని మొదలుకుని, వార్డు స్థాయి వరకు ప్రతిచోటా టీఆర్ఎస్ జెండాలు ఎగురవేయాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే పార్టీ ఆవిర్భావ సభలో తెలిపిన పార్టీ విధానాలను, పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలని కవిత సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణ అదేవిధంగా ప్రజా సంక్షేమం చుట్టూ అల్లిన ఈ సిద్ధాంతాలను సామాన్య ప్రజలకు అర్ధం అయ్యేలా వివరించి పార్టీకి గట్టి క్యాడర్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పడి 12 ఏళ్లు గడిచినప్పటికీ, రాష్ట్రం ఇంకా అనేక సమస్యలను ఎదుర్కొంటోందని కవిత తెలిపారు. నీళ్లు – నిధులు – నియామకాలు అనే తెలంగాణ ఉద్యమ నినాదాలు సాకారం కాలేదన్న ఆమె వలస పాలన దాటి దుష్పరిణామాలు పడుతున్నాయని చెప్పారు. తెలంగాణ తెచ్చుకుంటే బతుకులు మారుతాయనుకున్న వారికి నిరాశే ఎదురైందన్నారు.గతంలో స్వరాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా ఉద్యమించిన వారంతా ఇప్పుడు తెలంగాణ పునర్ నిర్మాణం, సబ్బండ, వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం మరోసారి ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు. అందుకే తెలంగాణ రక్షణ సేన జెండాను ప్రతి వాడకు, ప్రతి గడపకు చేర్చి, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయాలని కవిత పిలుపునిచ్చారు.అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన సమస్యలతో పాటు స్థానిక సమస్యలపై పార్టీ శ్రేణులు స్పందించాలని తెలిపారు. ఎక్కడికక్కడ ప్రజల గొంతుకగా నిలబడాలని, అవసరమైన చోట ప్రజా ఉద్యమాలు సైతం చేపట్టాలని సూచనలు ఇచ్చారు. అంతేకాదు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్లు తెలిపారు.