
టాలీవుడ్ నటులు నాగబాబు, ప్రకాశ్ రాజ్ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. దీంతో ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మెగా బ్రదర్ నాగబాబు తన ఎక్స్ వేదికగా తన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫొటోను షేర్ చేస్తూ లీడర్ షిప్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ నాయకుడు మాటే శాసనం. ఆయన ప్రయాణంలో ఎదుర్కొనే రాక్షసులను, అడ్డంకులను ఎవరూ చూడరు. ఏది తప్పు, ఏది ఒప్పు అనేది కేవలం ఆ లీడర్ కు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీ డౌట్స్ పక్కనపెట్టండి. నోళ్లు మూసుకోండి. జస్ట్ మీ నాయకుడిని గుడ్డిగా ఫాలో అవ్వండి’ అని రాసుకొచ్చారు.
నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నాగబాబు ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ కౌంటర్ ఇచ్చారు. “అసలు మీ ఉద్దేశం ఏంటి నాగబాబు గారు? సందేహాలు పక్కన పెట్టి, నోళ్లు మూసుకుని లీడర్ను గుడ్డిగా ఫాలో అవ్వాలా? మేము గొర్రెలం కాదు, బానిసలుగా బతకడానికి మాకు ఆసక్తి లేదు. మమ్మల్ని బెదిరించకండి. ప్రశ్నించడం అనేది మా ప్రాథమిక హక్కు. నాయకుడు ఎవరైనా సరే… చివరికి తనే దేవుడు అనుకున్నా సరే… ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ నాయకుడిపై ఉంది. అర్థమైందా?” అంటూ ప్రకాశ్ రాజ్ సమాధానమిచ్చారు.మొత్తంగా పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని సమర్థిస్తూ నాగబాబు ట్వీట్ చేయడం, ప్రశ్నించడం మా ప్రాథమిక హక్కు అంటూ ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇవ్వడం ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

