దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరగడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాలను తగ్గిస్తే, ప్రభుత్వం దాదాపు రూ.లక్ష కోట్ల ఆదాయం నష్టపోతుందని తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉందని స్పష్టం చేశారు.
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 37వ వార్షికోత్సవంలో మాట్లాడిన మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు.ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు. కానీ కొంతమంది లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నారంటూ పరోక్షంగా ప్రతిపక్ష ఆరోపణలను తిప్పికొట్టారు. సామాన్య ప్రజలు సాధిస్తున్న విజయాలను మరిచిపోయి, కేవలం నెగటివిటీని ప్రచారం చేయడం సరికాదన్నారు.మన మాటలు, చేతల ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘3-ఎఫ్’ (ఫ్యూయల్, ఫెర్టిలైజర్, ఫారెక్స్ – ఇంధనం, ఎరువులు, విదేశీ మారకం)పై ప్రత్యేక దృష్టి సారించిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతర్జాతీయ ఒత్తిళ్ల వల్ల ఎరువుల ధరలు ఊహించని స్థాయికి చేరాయన్నారు. మరోవైపు బంగారం ధరలు పెరగడం కూడా సవాలుగా మారిందని చెప్పారు.ఈ సంక్షోభాలన్నింటినీ సమర్థవంతంగా తట్టుకునేలా మోదీ నేతృత్వంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.