టాలీవుడ్ లో నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానుల (ఎగ్జిబిటర్లు) మధ్య గత కొన్ని రోజులుగా సాగుతున్న ‘పర్సంటేజ్ సిస్టమ్’ వివాదం క్లైమాక్స్ కు చేరింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించి, ఇండస్ట్రీకి మేలు చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు. తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు చిరంజీవితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. దీంతో ఫిలింనగర్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం మల్టీప్లెక్స్లలో సినిమా కలెక్షన్ల ఆధారంగా నిర్మాతలు, థియేటర్ల యజమానులు వాటాలు పంచుకుంటున్నారు. కానీ, సింగిల్ స్క్రీన్లకు మాత్రం సినిమా ఫలితంతో సంబంధం లేకుండా పాత పద్ధతిలోనే అద్దె చెల్లిస్తున్నారు. దీనిపైనే ఎగ్జిబిటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓటీటీల ప్రభావం, భారీగా పెరిగిన కరెంట్ బిల్లులు, థియేటర్ల నిర్వహణ ఖర్చులతో సింగిల్ స్క్రీన్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని వాపోతున్నారు. సినిమా సరిగా ఆడకపోతే, లక్షల్లో అద్దెలు కట్టలేక అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లే తమకు కూడా రెవెన్యూ షేరింగ్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వివాదం మరీ ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలపై తీవ్ర ప్రభావం చూపించనుంది. జూన్ 4న భారీ ఎత్తున రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచే పర్సంటేజ్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం హెచ్చరించింది. లేనిపక్షంలో థియేటర్లలో సినిమాను ప్రదర్శించేది లేదని తేల్చి చెప్పింది. గతంలో నిర్మాత దిల్ రాజు నేతృత్వంలో జరిగిన చర్చలు ఫలించలేదు. దీంతో తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్న ఎగ్జిబిటర్లు టికెట్ ధరల పెంపును కూడా వ్యతిరేకిస్తున్నారు. అధిక రేట్లు పెడితే సామాన్య ప్రేక్షకులు థియేటర్లకు దూరమవుతారని, ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా లేఖ రాశామని చెబుతున్నారు.
ఇదిలా ఉంచితే, సినీ ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య తలెత్తినా చిరంజీవి పెద్దన్న పాత్ర పోషిస్తారు.ఈసారి తన కుమారుడి సినిమా విడుదల ఇరకాటంలో పడటంతో పాటు వందలాది థియేటర్ల యజమానుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ సమస్య పరిష్కారానికి నడుం బిగించారు.ఈ క్రమంలోనే నిర్మాతల మండలి, ప్రొడ్యూసర్స్ గిల్డ్తో చర్చించి, ఇటు నిర్మాతలకు నష్టం జరగకుండా, అటు ఎగ్జిబిటర్లకు న్యాయం జరిగేలా చూస్తారని ఇండస్ట్రీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ మెగా భేటీ తర్వాతైనా ఈ వివాదానికి తెరపడుతుందా.? ‘పెద్ది’ సినిమా విడుదలకు మార్గం సుగమం అవుతుందా.? లేదా.? అనేది చూడాలి.