Find Articles

మరో రూ.20 పెరగనున్న లీటర్‌ పెట్రోల్‌?

మరో రూ.20 పెరగనున్న లీటర్‌ పెట్రోల్‌?

దేశంలో ఇంధన ధరల పెరుగుదల సామాన్యులపై పెను భారంగా మారింది. ఇప్పటికే వరుసగా నాలుగు సార్లు ధరలు పెరగడంతో లీటరుపై దాదాపు రూ.7.38 వరకు అదనపు భారం పడింది. అయితే ఈ బాదుడు ఇంతటితో ఆగేలా లేదని, చమురు సంస్థల నష్టాల నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం లాంటి ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలు తాజా పెంపుతో పూర్తిగా భర్తీ కాలేదు. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు, మన దేశీయ రిటైల్ ధరలకు ఉన్న వ్యత్యాసాన్ని పూడ్చాలంటే లీటరుపై మరో రూ.20 నుంచి రూ.33 వరకు పెంచాల్సి ఉంటుందని అంచనా. అంత భారాన్ని ఒకేసారి వేయడం సాధ్యం కాకపోయినా, రానున్న రోజుల్లో విడతల వారీగా ధరలను పెంచక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

అంతర్జాతీయంగా ఇరాన్ వివాదం కారణంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ, మనదేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల వల్ల వరుసగా 74 రోజుల పాటు ధరలను పెంచకుండా నిలిపివేశారు. భారత్ తన అవసరాల కోసం ఏకంగా 88 శాతం ముడిచమురును ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా రేట్లు పెరుగుతున్నా ఇక్కడ ధరలను స్థిరంగా ఉంచడం వల్ల ఈ మూడు ప్రభుత్వ రంగ సంస్థలపై ఏకంగా రూ.1.2 లక్షల కోట్లకు పైగా అదనపు భారం పడింది. ఈ భారీ నష్టాల నుంచి సంస్థలు కోలుకోవాలంటే ధరల పెంపు ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది.

ఒకవేళ ఇరాన్, అమెరికా మధ్య చర్చలు సఫలమై అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ, రవాణా ఖర్చులు, పాత నష్టాల కారణంగా మనకు వెంటనే ఊరట లభించే అవకాశం లేదు. అటు ప్రజలపై ద్రవ్యోల్బణ భారం పడకుండా, ఇటు చమురు సంస్థలు కుప్పకూలిపోకుండా సమతుల్యతను కాపాడటం ఇప్పుడు ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారింది. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఇంధన మంటలు సామాన్యుడిని మరిన్ని ఇబ్బందులకు గురిచేసేలా ఉన్నాయి.

ManaTV Team